Viral News : మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఒక ఆచారం ఉంటుంది. ఎక్కడి ఆచారం అక్కడే. ఎక్కడి సంప్రదాయాలు అక్కడే. వాటినే కొందరు మూఢనమ్మకాలు అంటారు. ఒక్కో ప్రాంతంలో మూఢనమ్మకాలు ఒక్కో తీరుగా ఉంటాయి. కొందరు వర్షాల కోసం యజ్ఞాలు చేస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో కప్పలకు పెళ్లిళ్లు చేస్తారు. ఇప్పటికీ అటువంటి ఆచారాలు గ్రామాల్లో ఉన్నాయి. అవన్నీ ఓకే కానీ.. ఒక చోట మాత్రం వర్షాల కోసం ఏం చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు. పదండి.. వాళ్లు వర్షాల కోసం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

అది కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ దగ్గర్లోని కలకేరి గ్రామం. అక్కడ వర్షాలు లేక తాగడానికి నీళ్లు కూడా లేవట. వర్షం కురవాలని మొక్కని దేవుడు లేడు. దేశమంతా వర్షాలు కురుస్తున్నా ఒక చోట మాత్రం వర్షం పడటం లేదు. చాలా ప్రాంతాల్లో వర్షం లేక అల్లాడుతున్నారు జనాలు. అలాంటి ప్రాంతాల్లో కలకేరి ఒకటి.
Viral News : వాళ్ల నమ్మకం ఫలించిందా?
కర్ణాటక రాష్ట్రమంతా జూన్ నెలలో వర్షాలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం అయినా.. కలకేరి గ్రామంలో వర్షాలు పడలేదు. చుక్క నీరు లేదు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఇటీవల చనిపోయిన వారి లిస్టు తయారు చేసి.. వాళ్ల కుటుంబీకులతో మాట్లాడి.. వాళ్ల సమాధుల వద్దకు వాళ్లను తీసుకెళ్లారు.
ఆ తర్వాత ఆ సమాధిని తవ్వి మృతదేహాన్ని బయటికి తీసి.. ఆ శవం నోట్లో పైపు పెట్టి నీటిని వదిలారు. అలా.. ఇటీవల చనిపోయిన 25 మంది సమాధుల దగ్గరికి వెళ్లి వాళ్ల మృతదేహాలను వెలికి తీసి.. ఆయా శవాల నోట్లో నీళ్లు పోశారు. నీళ్లు పోసిన కొద్దిసేపటికే ఆ ఊళ్లో చినుకులు పడ్డాయి. దీంతో వాళ్ల నమ్మకం మరింత బలపడింది.
అది వర్షాధార ఊరు. వ్యవసాయం మీదనే ఆధారపడి ఆ ఊరి ప్రజలు జీవిస్తారు. వర్షాలు పడకపోతే ఆ ఊరి ప్రజలకు తిండే ఉండదు. అంతటా వర్షాలు పడ్డా.. ఆ ఊళ్లో మాత్రమే ఎక్కువగా వర్షాలు పడకపోవడానికి ఆ ఊరిలో ఉండే ఓ శాపమే కారణమట.
ఆ గ్రామంలో ఓ వృద్ధుడు నోరు తెరిచి చనిపోతే అతడి నోరు మూయకుండానే అతడిని సమాధి చేశారట. ఆ తర్వాత ఆ ఊళ్లో కరువుకాటకాలు సంభవించాయట. దానికి కారణం ఏంటని గ్రామస్థులు జ్యోతిష్కుడితో మాట్లాడగా.. దాహంతో ఉన్న శవమే గ్రామాన్ని శపించిందని.. అందుకే గ్రామంలో వర్షాలు లేవని చెప్పాడట. దీంతో వెంటనే ఆ వృద్ధుడి సమాధిని తవ్వి అతడి మృతదేహానికి నీళ్లు తాగించారట. వెంటనే ఆ ఊరిలో వర్షం పడిందట. అప్పటి నుంచి ఆ ఊళ్లో వర్షాలు పడకపోతే వెంటనే సమాధులను తవ్వి శవాలకు ఇలా నీళ్లు పట్టిస్తుంటారు. తాజాగా వర్షాలు పడకపోతే మళ్లీ 25 శవాలకు నీళ్లు తాగించారట. వెంటనే ఆ ఊళ్లో వర్షాలు పడ్డాయట. దీంతో గ్రామస్థులంతా సంతోషంలో మునిగి తేలారు.