Shocking : తాజాగా కర్ణాటకలో షాకింగ్ ఘటన జరిగింది. తుముకూరు జిల్లా మధుగిరి తాలూకాలోని గిడ్డయ్యనళ్ల గ్రామానికి చెందిన రేణుక ప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు తెలుగు హారర్ ఫాంటసీ చిత్రం అరుంధతిని చాలా చాలా సార్లు చూసి ఆ సినిమాలో చూపిన విధంగా మోక్షం లభిస్తుందని నమ్మకంతో బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అటుగా వెళుతున్న కొందరు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా మారింది. డాక్టర్ల సూచన మేరకు అక్కడి నుంచి బెంగళూరు విక్టోరియా హాస్పిటల్ కి తరలించారు. 60 శాతం కాలిన గాయాలతో హాస్పటల్లో చికిత్స పొందుతూ గురువారం రేణుక ప్రసాద్ మరణించాడు.
వివరాల్లోకెళితే.. రేణుక ప్రసాద్ ఎస్ ఎస్ ఎల్ సి పరీక్షల్లో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టాపర్ గా నిలవడంతో కుటుంబ సభ్యులు ఉన్నత చదువుల కోసం అతడిని తుముకూరులోని ఓ కాలేజీలో చేర్పించారు. ఫస్ట్ ఇయర్ పియుసి పూర్తి అయ్యాక సినిమాలు చూసే వ్యసనం వల్ల చదువు మానేశాడు. ఏ పని చేయకుండా ఒక చోటి నుంచి మరో చోటికి తిరుగుతూ ఉండేవాడు. అయితే తెలుగులో సూపర్ హిట్ సినిమా అరుంధతిని 15, 20 సార్లు చూశాడు. అరుంధతి సినిమాలో హీరోయిన్ ఆమె ఇష్టానుసారం చనిపోయి, శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవడానికి పునర్జన్మ పొందుతుంది. ఈ సినిమా చూసి ప్రేరణ పొందిన రేణుక ప్రసాద్ తాను కూడా ఇష్ట ప్రకారం చనిపోయి మళ్లీ పునర్జన్మ పొందాలని అనుకున్నాడు. దీంతో బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ నుండి 20 లీటర్ల పెట్రోల్ ని తీసుకొచ్చుకున్నాడు.
Shocking :అరుంధతి సినిమా చూసి నిప్పంటించుకున్న ఓ యువకుడు…

అందులో ఒక లీటరు ఉపయోగించి ఒంటిపై పోసుకుని నిప్పటించుకున్నాడు అని పోలీసులు తెలిపారు. తనను తాను కాల్చుకున్న వెంటనే తనకు మోక్షం కలగాలని బాధితుడు తన తండ్రి సిద్ధప్పను కోరిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ సంఘటనపై కొడిగేవాహళ్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేణుక ప్రసాద్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు, పొరుగువారు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ అతడు బాగా చదివి మంచిగా కెరియర్ లో ఉండాలని కోరుకున్నాం. దురదృష్టవశాత్తు సినిమాల పట్ల అతని వ్యసనం అతని ప్రాణాలను తీసింది అని లెక్చరర్ అయిన అతడి సమీప బంధువు రాజు తమ బాధని వ్యక్తపరిచారు