Chandrababu : చంద్రబాబు నాయుడు ‘ఒక్క ఛాన్స్’ వెనక ఇంత కథ ఉందా?

Chandrababu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు బాగా హీటెక్కుతున్నాయి. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో భేటీ అవడం, వైసీపీ నాయకులపై సీరియస్ అవడం అన్నీ చూశాం. దీంతో జనసేనాని గురించే అప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీతో పవన్ భేటీ అవడంతో ఒక్కసారిగా జనసేన పార్టీకి పాపులారిటీ పెరిగింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది.

chandrababu says that these are his last elections in kurnool
chandrababu says that these are his last elections in kurnool

ఇటీవల కర్నూలు జిల్లాలోని పత్తికొండ, నంద్యాల, కొడుమూరు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా పర్యటన కోసం రాయలసీమ వెళ్లిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. కొన్ని ప్రాంతాల్లో అక్కడి జనాలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగాలు చేశారు. ఆసమయంలోనే చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు యూ టర్న్ తీసుకున్నాయి.

Chandrababu : నన్ను గెలిపిస్తే ఓకే లేదంటే ఇదే నా చివరి ఎన్నిక అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

గత సంవత్సరం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబును అవమానించిన ఘటనపై చంద్రబాబు భావోద్వేగానికి గురవుతూ దాని గురించి చెప్పుకొచ్చారు. నేను ఒక సీనియర్ నాయకుడిని అని కూడా చూడకుండా నన్ను అవమానించారు. అసెంబ్లీలో నా భార్యను కూడా అవమానించారు. అది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని బయటికి వచ్చాం. అందుకే.. మళ్లీ నేను క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతనే గౌరవ సభలో అడుగు పెడతా. నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలి అంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. మీరు నన్ను గెలిపించాలి. మీరు నన్ను గెలిపిస్తే సరి.. లేదంటే ఇదే నా చివరి ఎన్నిక. ఈ ఎన్నికల్లో మనమంతా చాలా కష్టపడి గెలవాలి అంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని దాని కోసం ఇప్పటి నుంచే చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారని.. ఇలాంటి కవ్వింపు చర్యలు చాలానే చూశాం అంటూ నెటిజన్లు, ఇతర పార్టీల నేతలు కామెంట్లు చేస్తున్నారు. చూద్దాం మరి చంద్రబాబు భావోద్వేగం వచ్చే ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందో లేదో?