TDP vs BJP : ప్రాంతీయ పార్టీలను మట్టికరిపించి దేశమంతా ఏలాలి, అన్ని రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, ఇదే ప్రస్తుతం బీజేపీ ముందున్న సవాల్. ఇప్పటికే దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇంకొంచెం కష్టపడితే సౌత్ ఇండియాను కూడా ఏలేయొచ్చు. ప్రస్తుతం బీజేపీ ఫోకస్ కూడా సౌత్ ఇండియాకు షిఫ్ట్ అయింది. ఇప్పటికే సౌత్ ఇండియాలో కర్ణాటకలో అధికారంలో ఉంది బీజేపీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులోనూ పాగా వేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది.

తెలంగాణ, ఏపీలో అయితే ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ యాక్టివ్ గా ఉంది. ఏపీలోనూ బీజేపీ బలపడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఏపీలో ఉన్న టీడీపీ పార్టీని ప్రసన్నం చేసుకునే పనిలో బీజేపీ పడింది. అధికార పార్టీ వైసీపీని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు తప్పితే టీడీపీని మాత్రం అస్సలు విమర్శించడం లేదు బీజేపీ నేతలు.
TDP vs BJP : టీడీపీతో టచ్ లోకి వస్తున్న బీజేపీ అగ్రనేతలు
ఓవైపు వైసీపీ నేతలు బీజేపీని విమర్శిస్తుంటే, బీజేపీ అగ్రనేతలు ఏకంగా టీడీపీకి టచ్ లోకి వస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ సపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఇస్తుండటం, చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీని ఓడించేందుకు ప్రణాళికలు రచించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బీజేపీతో టీడీపీ బద్ధశత్రువుగా మారింది. ప్రధాని మోదీతోనే ఢీ అంటే ఢీ అన్నది. కానీ.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు బీజేపీ విషయంలో టీడీపీ కూడా ఆచీతూచీ ప్రవర్తిస్తోంది. ఇది వైసీపీకి నచ్చడం లేదు.
ఇదే అదునుగా బీజేపీతో మంచి సంబంధాలు నెరిపి, వైసీపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా టీడీపీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందుకే.. టీడీపీ కానీ, ఏపీ బీజేపీ కానీ.. ఎవరూ ఒకరినొకరు నిందించుకోవడం లేదు. రెండు పార్టీల టార్గెట్ వైసీపీగానే సాగుతోంది. సోము వీర్రాజు కూడా వైసీపీపైన విరుచుకుపడుతున్నాడు కానీ.. టీడీపీని ఏమీ అనడం లేదు. ఇప్పుడు చంద్రబాబే దార్శనికుడు అంటూ వీర్రాజు పొగుడుతున్నాడు. చూద్దాం.. ఇంకా ఎన్నికల సమయానికి ఏపీలో ఇంకెన్ని వింతలు చోటు చేసుకుంటాయో.