KCR : కేంద్ర ప్రభుత్వం అన్నా… ప్రధాని మోదీ అన్నా అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఒకానొక దశలో కేంద్రం మీద సమరశంఖం పూరిస్తున్నట్టు కూడా తెలిపారు. ప్రధాని మీద ఏకంగా యుద్ధమే చేస్తామని ప్రకటించారు. కేంద్రం విధానాలను అడుగడుగునా తప్పుపట్టారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఎందుకో చప్పబడిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే తాజాగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

లేటెస్ట్ మీడియా సమావేశంలో ఎలాంటి పంచ్ డైలాగ్స్ లేవు. దేశమంతా ప్రధాని మోదీ పాలన గురించి ఏం చెబుతోందో అదే చెప్పుకొచ్చారు అంతే కానీ.. అంతకు మించి ఆయన చెప్పిందేం లేదు. అది కూడా తీవ్రంగా విమర్శిస్తూ కూడా కాదు. చాలా చప్పగా చెప్పుకొచ్చారు.
KCR : నీతి ఆయోగ్ సమావేశాన్ని కేసీఆర్ ఎందుకు బహిష్కరించారు?
తాజాగా జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. దాని వల్ల కేంద్రానికి వచ్చే నష్టం ఏం లేదు. ఒక్క తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించినంత మాత్రాన నీతి ఆయోగ్ సమావేశం ఆగదు కదా. ఆ విషయాన్ని కేసీఆర్ ఎందుకు గ్రహించలేకపోయారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయిందన్నారు సీఎం. నీతి ఆయోగ్ ఇచ్చిన సిఫారసులను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆయన దుయ్యబట్టారు. మోదీ హయాంలో దేశం నాశనం అయిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడూ చెప్పేమాటలే ఇవి కూడా. ఇందులో కొత్తేమీ లేదు కానీ.. మోదీపై యుద్ధం, సమర భేరీ అనే మాటలు మాత్రం ఈసారి కేసీఆర్ నోట్లో నుంచి రాలేదు.
నిజంగా మోదీకి వ్యతిరేకంగా ఉద్యమించాలని అనుకుంటే.. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి అక్కడ కేసీఆర్ ఇదంతా చెప్పొచ్చు కదా అని కొందరు విమర్శిస్తున్నారు. అక్కడ అవకాశం రాకపోతే, ఢిల్లీలోనే మీడియా సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ గురించి మాట్లాడొచ్చు కదా అంటూ విమర్శలు వస్తున్నాయి. మోదీకి వ్యతిరేకంగా ఉద్యమించే ఇద్దరు ముగ్గురు నేతలు కూడా ఇలా చప్పబడిపోతే.. ఇక మోదీని అడ్డుకునేదెవరు. మోదీకి ఇక అడ్డు ఎవరు వస్తారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.