బీజేపీకి షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. పార్టీలో తనకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని రఘునందన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.తన గెలుపుతోనే పార్టీలో ఊపు వచ్చిందన్న రఘునందన్ తాను దుబ్బాకలో గెలిచి ఉండకపోతే ఈటల బీజేపీలో చేరేవాడా..? అని ప్రశ్నించారు. అలాంటి తనను పార్టీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రఘునందన్ అసంతృప్తికి కారణాలు ఇవేనా..?
రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగా ఏర్పడింది. దాంతో ఈ పదవిని తనకు అప్పగించాలని రఘునందన్ కొన్నాళ్ళుగా కోరుతున్నారు. కానీ రఘునందన్ విజ్ఞప్తిని రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టున్న రఘునందన్ రావు బీజేపీ జాతీయ అధికారి ప్రతినిధి పదవి కూడా ఆశించాడు. ఈ పదవి కూడా ఆయనకు దక్కలేదు.
తన కంటే తరువాత పార్టీలో చేరిన నేతలకు జాతీయ ఎగ్జిక్యూటివ్ పదవిని కట్టబెట్టిన అధినాయకత్వం.. సీనియర్ అయిన తనకు మాత్రం మొండిచేయి చూపుతుందని రఘునందన్ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతుండటంతో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడంతో రఘునందన్ సైలెంట్ అయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీకి రఘునందన్ రావు గుడ్ బై చెప్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.