Hyderabad : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో గల కొందరు రాజకీయ నేతల ఇండ్లలో ఈరోజు తెల్లవారుజాము నుండే ఐటీ దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే బడంగ్ పెట్ ,నార్సింగ్, ,బంజారా హిల్స్ తుక్కుగూడ వంటి ప్రాంతాలలో ఐటీ అధికారులు ఏక కాలంలోనే దాడులు నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకురాలు బడంగ్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అలాగే టిఆర్ఎస్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి , అలాగే మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇండ్లపై ఏకకాలంలో ఐటి అధికారులు సోదాలు జరిపారు.
ఈరోజు ఉదయం 5 గంటల నుండి బాలాపూర్ లోని కాంగ్రెస్ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదర నిర్వహించగా ఆ సమయానికి ఇంట్లో పారిజాత మరియు ఆమె భర్త నరసింహారెడ్డి లేరు. వారి కూతురు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే మేయర్ పారిజాత ప్రస్తుతం తిరుపతిలో ఉండగా , ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అయితే ఈసారి బడంగ్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపు నుంచి మహేశ్వరం టికెట్ కోసం ఆశిస్తున్నారు.
అలాగే టిఆర్ఎస్ నేత వంగవీటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఈరోజు తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే వంగవీటి ఇంట్లో అధికారులు అతి తక్కువ సేపు మాత్రమే సోదాలు నిర్వహించినట్లు సమాచారం. అలాగే మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చేన్న గారి లక్ష్మారెడ్డి ఇంటిపై కూడా ఐటీ దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం బహదూర్ గూడెం శివారులో ఉన్న ఆయన ఇంటిపై తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో సడన్ గా ఐటి సోదాలు జరగడంతో రాజకీయ నేతలు ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.